హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, మాణిక్రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఉద్యోగాలను సిగ్గు, శరం లేకుండా రేవంత్రెడ్డి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని ఎద్దేవాచేశారు.
ఎమ్మెల్యేగా కేసీఆర్ గురువారం ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఒకటో తేదీన వేతనాలు వేశానని చెప్పుకుంటున్న సీఎం.. పదేండ్లలో కొత్తగా నియమితులైన 1,60,083 మందికి కూడా వేతనాలు వేశారా? లేదా? అని ప్రశ్నించారు. వేతనాలు వేసి ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్న కేసీఆర్.. 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,083 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని వివరించారు.
సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్న 40,652 ఉద్యోగాల నుంచే ఇటీవల 6,596 నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చి, వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికి రేవంత్రెడ్డి ప్రయత్నించారని మండిపడ్డారు. పదేండ్లలో కేసీఆర్ కల్పించినన్ని ఉద్యోగాలు దేశం లో ఏ రాష్ట్రంలోనైనా కల్పించినట్టు కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. లేదంటే కేసీఆర్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని అన్నారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ కల్పించిన ఉద్యోగాలకు తోడు.. అదనంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ తన ప్రమాణ స్వీకారానికి దళిత ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించలేదని ఒక టీవీ చానల్ ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను కేసీఆర్ ఆహ్వానం మేరకు 11 గంటలకే అసెంబ్లీకి వచ్చానని, అసత్యాలు ప్రచారం చేస్తున్న సదరు టీవీ యాజమాన్యం, రిపోర్టర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని హెచ్చరించారు.