హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఏం తప్పు చేశానని ప్రభుత్వం, పోలీసులు వేధిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అసెంబ్లీ నక్సలైట్ అంటున్నారని.. పాలకవర్గాన్ని ప్రశ్నించేందుకు, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న తాను అసెంబ్లీ నక్సలైట్ అవుతానని చెప్పారు. సీఐడీ విచారణ అనంతరం శనివారం ఆయన తన భార్య శాలినీరెడ్డి, బీఆర్ఎస్ న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన నేరం ఏమీలేని, అతి చిన్న కేసులకు కూడా సీఐడీ విచారణ చేపట్టడం పెద్ద జోక్ అని అన్నారు. సీఐడీ అధికారి తనను ఏం అడుగుతున్నారో క్లారిటీ లేదని చెప్పారు. మేడారం జాతరకు కుటుంబంతో వచ్చిన తనపై, భార్యపై కేసులు పెట్టి విచారణకు పిలిచారని, విచారణంటూ చేయాల్సి వస్తే 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన కరీంనగర్ సీపీపై విచారణ చేయాలని అన్నారు. కరీంనగర్ సీపీ అక్రమాలపై సిట్ విచారణ చేయాలని అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ పోలీసులను సీపీ వేధిస్తున్నారని సీఐ, ఎస్సై, హోంగార్డుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్నాను కాబట్టే తనకు అక్రమంగా నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. తాను అనని మాటలను కూడా అన్నట్టు చూపిస్తున్నారని, ఇదే అంశంపై ఐపీఎస్ అసోసియేషన్కు లెటర్ కూడా రాసినట్టు వెల్లడించారు. పొంగులేటి మైనింగ్ సాంపై హౌస్ కమిటీ వేయాలని తాను కూడా అసెంబ్లీలో అడిగానని, ఆ టాపిక్ను డైవర్ట్ చేయడానికి తనపై అభాండాలు వేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో తనపై ఎథిక్స్ కమిటీ వేశారని, మరి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడే మాటలు ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రావా? అని ప్రశ్నించారు. సీఎం ఏం మాట్లాడినా కరెక్టు అవుతది.. తాను మాట్లాడితే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. ఇబ్బందులకు గురిచేయాలని కేసులు పెట్టినంత మాత్రాన ప్రజల పక్షాన మాట్లాడటం ఆపబోనని స్పష్టంచేశారు. కేసీఆర్ సైనికులు ఎవ్వరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడరని తేల్చిచెప్పారు. కరీంనగర్, హనుమకొండ నుంచి తీసుకొచ్చి చెత్తను హుజూరాబాద్లో వేస్తానంటే ఒప్పుకోనని హెచ్చరించారు. హుజూరాబాద్కు కేటాయించిన డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7,8వ తేదీల్లో నిరాహారదీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ సీఎం అవ్వగానే చాలామంది పోలీసుల మెడలకే ఈ కేసుల ఉచ్చు బిగుసుకుంటుందని వ్యాఖ్యానించారు. సీపీ గౌస్ఆలంపై తాను చేసిన ఆరోపణలు తప్పయితే తనను ఉరి తీయాలని కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. తన న్యాయపోరాటం ఆపబోనని చెప్పారు.