నేరేడ్మెట్, డిసెంబర్ 8: ‘మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావునే ఓడిస్తారా? మీ అంతు చూస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల భర్తలను, నాయకులను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. తన మొబైల్ నంబర్ డిస్ప్లే అయ్యేలా సదరు వ్యక్తులు టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సదరు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆయన మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్కు ఫిర్యాదు చేశారు. గౌతమ్నగర్ కార్పొరేటర్ భర్త మేకల రాముయాదవ్, నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ భర్త ఉపేందర్రెడ్డి, జవహర్నగర్ కార్పొరేటర్ మురుగేశ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మౌలాలి మాజీ కార్పొరేటర్ భర్త అమీనుద్దీన్, అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డితోపాటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన ఇద్దరు అనుచరులకు మూడు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే మర్రి పేర్కొన్నారు. వీరంతా మల్కాజిగిరి, నేరేడ్మెట్, అల్వాల్ పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసినట్టు ఆయన సీపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.