Malla Reddy | మేడ్చల్ : మా నాన్న ఎన్నో నోములు నోచితే.. నేను పుట్టాను అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ఆదరణ లభించిందంటే.. ఇది నా అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. మీ అందరికీ నా పాదాభివందనాలు. ఇది నా అదృష్టమన్నా.. మా నాన్న ఎన్నో నోములు నోచుకుంటే నేను పుట్టిన అన్నా.. మీరంతా(కార్యకర్తలను ఉద్దేశించి) నాకు దొరికారు అంటే మామూలు విషయం కాదన్నా.. ఇంత అభిమానం, ఆదరణ దొరికిందంటే మామూలు విషయం కాదన్నా.. ఎవరికీ దొరకని ఆదరణ మీ మల్లన్నకే దొరికింది. ఇది నా అదృష్టమని మల్లారెడ్డి తెలిపారు.
మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. బీజపీ, కాంగ్రెస్లో ఏం లేదు. దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఎన్నికల్లో గెలవాలని కసమీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీలకు ఒక లీడర్, కేడర్ లేదు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. నువ్వు మా పార్టీలోకి రాకపోతే ఫంక్షన్ హాల్ కూలగొడుతామని ఓ ఎంపీపీని బెదిరించారు. ఇంకో చైర్మన్ వద్దకు వెళ్లి మెయిన్ రోడ్డుకు బిల్డింగ్ కట్టావు.. వస్తావా రావా అని బెదిరించారు. ఇలా భయపెట్టి, భయాందోళనకు గురి చేసి కాంగ్రెసోళ్లు బీఆర్ఎస్ నేతలను లాక్కెళ్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మేడ్చల్లోనే ఒక వెయ్యి ఇండ్లు కూలగొట్టారు. జవహర్ నగర్లో 80 ఇండ్లు, ఫీర్జాదిగూడలో 150 ఇండ్లు, చీర్యాలలో 60 ఇండ్లు కూలగొట్టారు. కాంగ్రెసోళ్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ చర్యలను చూసి పేదోళ్లు బాధపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయని ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ రైతులకు కరెంట్, సాగునీరు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకు పరిపాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదు. సాగునీరు ఉన్నా ఇవ్వలేకపోతున్నారు. కరెంట్ ఉన్న ఇవ్వలేకపోతున్నారు. అన్ని ఉన్నాగానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వాళ్లు ఏ పని చేయలేకపోతున్నారు. నాలుగు నెలల్లోనే ప్రజలు చీత్కరించుకుంటున్నారు అని మల్లారెడ్డి తెలిపారు.