KTR | హైదరాబాద్ : నిన్న ఉభయ సభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడకగా సాగింది. ఇలాంటి ప్రసంగాన్ని వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. ఇంత దారుణమైన ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో విని ఉండం. వెయ్యి ఎలుకలు పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్లు, చేయాల్సిన ఘాతుకాలన్నీ చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం చేసి, గత ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తప్పుబడుతున్నా. గవర్నర్ దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత.. కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్ ఐదేండ్లు ఎట్ల ఉండబోతుందో మాకు, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.