MLA KP Vivekanand | బహిరంగ సభల్లో సీఎం రేవంత్ అభ్యంతరకర భాష వాడుతున్నారని.. సీఎం అని, ఇచ్చిన హామీలను మరిచి తిట్ల పురాణం అందుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలలకే రేవంత్ ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు అఫిడవిట్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు.
ఆగస్టు నెలలో రైతు రుణమాఫీ చేస్తామని మహబూబాబాద్, మెదక్ సభల్లో రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేశారని.. దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. 420హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తొక్కి రేవంత్ సీఎం అయ్యారన్నారు. రేవంత్ నాయకత్వాన్ని వీహెచ్, సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు
వ్యతిరేకిస్తున్నారన్నారు. రేవంత్ కరెంటు తీగ అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే జనజాతర.. రేవంత్ చేసేది ఓట్ల జాతర అని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పవర్ మినిస్టర్ భట్టి సీపీఐ ఆఫీస్కు వెళ్తే అక్కడ అరగంటపాటు కరెంటు పోయిందన్నారు. విద్యుత్ శాఖ మంత్రికే ఈ పరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేవంత్ బీజేపీలో చేరుతారని ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారని.. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు రేవంత్ తాపత్రయపడుతున్నారని.. గాంధీ భవన్కు తాళం వేసి ఇంటి నుంచే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్సేల్గా అమ్మేస్తారని ఆరోపించారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేస్తోందన్నారు.
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలైందని.. బిల్డర్లకు పర్మిషన్లు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారిందన్నారు. బీబిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలు లేవని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి నియంత్రించలేకపోతున్నారన్నారు. ముదిరాజ్ ఎమ్మెల్యే మీ పార్టీలో ఉన్నారని.. ఇప్పటి వరకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారా? అని నిలదీశారు. కేసీఆర్ బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్ నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని తెలిపారు.