హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచేశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం, భద్రతాపరమైన చర్యలు, ప్రొటోకాల్ సమస్యల పరిష్కారం కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిసినట్టు వివరించారు. తెలంగాణ భవన్లో బుధవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంను కలిసినంత మాత్రాన పార్టీ మారుతామని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. తాము పార్టీ మారుతున్నట్టు కాంగ్రెస్ నాయకులతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారని, దీనికి ఫుల్స్టాప్ పెట్టకుంటే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు.
అధిష్ఠానానికి మాపై సంపూర్ణ విశ్వాసం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నది. నా నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదాలపై ఇప్పటికే చెప్పా. ఇదే విషయం మీద ఐజీ శివధర్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డిని కలిశాం. స్థానిక అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మేం పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. ప్రజల్లో గందరగోళం సృష్టించి మమ్మల్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేం కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ సారథ్యంలో మెదక్ పార్లమెంటు స్థానం గెలుచుకుంటాం. నాపై దుష్ప్రచారం ఆపకుంటే పరువునష్టం దావా వేస్తా.
– సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
బతికున్నంతకాలం బీఆర్ఎస్తోనే
స్థానిక సమస్యలపై ఎస్పీ, కలెక్టర్ను ఇదివరకే కలిశాం. వాటికి కొనసాగింపుగానే శివధర్రెడ్డిని, సీఎం రేవంత్ను కలిశాం. నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్తోనే ఉంటా. కేసీఆర్ నన్ను హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేశారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ హయాంలో జోడెడ్లలా సాగాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని మూడునాలుగు లక్షల మెజార్టీతో కైవసం చేసుకుంటాం. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైంది. దాని పనులు కొనసాగించాలని సీఎంను కోరాం.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
పుట్టింది, సచ్చేదీ ఇక్కడే
నేను రాజకీయంగా పుట్టింది బీఆర్ఎస్లోనే. సచ్చేది కూడా బీఆర్ఎస్లోనే. నా ప్రయాణం జీవితాంతం కేసీఆర్తోనే. కేసీఆర్ నాకు ఎమ్మెల్యేగా రాజకీయ జన్మ ఇ చ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశా. సీఎం కేసీఆర్గా ఉన్నపుడు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు జహీరాబాద్కు మంజూరు చేశారు. జరుగుతున్న పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇలాంటి వాటికి ఆసారం ఇవ్వొద్దని, మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఆపొద్దని కూడా కోరా. భద్రతకు సంబంధించిన అంశాలపైనా కూడా సీఎంతో మాట్లాడాం.
-మాణిక్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఓ ఎండ్రకాయల పార్టీ
నియోజకవర్గ సమస్యలపైనే కాంగ్రెస్ను కలిశాను. రేవంత్రెడ్డి కాంగ్రెస్కు కాదు, రాష్ర్టానికి సీఎం. ఆయనను కలవడం తప్పెలా అవుతుంది. కాంగ్రెస్ ఓ ఎండ్రకాయల పార్టీ. అందులో ఎవరు చేరుతారు? 2001 నుంచీ కేసీఆర్తోనే ఉన్నా. ఇకపైనా ఉంటా. మేం కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఆ పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాపై విష ప్రచారం చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిని కలిసి మల్లన్నసాగర్ నుంచి నీళ్లివ్వాలని కోరాను. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండాసురేఖ ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మాపై ఓడినవారు అధికారం చెలాయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యల కోసం సీఎంను నెలకోసారి కలుస్తా. దుష్ప్రచారం చేస్తే మాత్రం ఊరుకోను.
– కొత్త ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే