Kadiyam Srihari | హైదరాబాద్ : ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది సమీక్ష చేసుకోవాలని కడియం సూచించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో కడియం శ్రీహరి మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లు ఉంది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. కానీ జాతీయ స్థాయిలో అనేక తెలంగాణ అవార్డులు అందుకున్నది గవర్నర్ మరిచిపోయారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచింది. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది నిజం కాదా? ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది అని శ్రీహరి తెలిపారు.
ప్రజలందరూ ఇప్పుడు సంతోషపడుతున్నట్లు మాట్లాడడం సరైంది కాదు. పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారు అని చెప్పడం సముచితం కాదు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదు. గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది. ఇప్పుడు కావడమేమిటి అని కడియం ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు ఎటువంటి ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలో లేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన రూట్ మ్యాప్ గవర్నర్ ప్రసంగంలో లేదు. అది ఉంటే బాగుండేది. గవర్నర్ చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలను చెప్పించింది. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన లేదు. మద్దతు ధరకు రూ. 500 కలిపి ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. దానిపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనబడడం లేదు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై మా నుండి కూడా సరైన సమాధానం ఉంటుంది అని కడియం పేర్కొన్నారు.