హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ డొల్లతనాన్ని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేక అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు. సభను పక్కదారి పట్టించడానికి సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారని మండిపడ్డారు. సీఎం అయిన తరువాత కూడా రేవంత్ వ్యవహారశైలి, భాష మారలేదని మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు చాలా సంయనంతో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
కేసీఆర్ను అనుచిత, అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని హితవు చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్పై కాకుండా రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని కేసీఆర్ను దూషించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, గట్టిగా అరిచినా, మొత్తుకున్నా అవకాశం ఇవ్వలేదని, మరొక కాంగ్రెస్ సభ్యుడికి అవకాశం ఇచ్చారని తెలిపారు. కనీసం అసెంబ్లీ అవరణలో ప్రజలకు తమ వాదన వినిపించుకుందామంటే మీడియా పాయింట్కు కూడా పోనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రగతిభవన్ ముందు కంచెలు తొలగించి, అసెంబ్లీలో తమను అడ్డుకోవడానికి కంచెలు వేశారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరామని వెల్లడించారు.