నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)/కోదాడ: ప్రాజెక్టులు కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) కంట్రోల్లోకి పోవడం కాంగ్రెస్ వైఫల్యమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి శివారులో మీడియాతో, సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే కేసీఆర్పై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పోరాటం వల్లే ఇన్నాళ్లు కేంద్రం కుట్రలు సాగలేదని, కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్లను అప్పగించారని ఆరోపించారు.
రాష్ట్ర కంట్రోల్లో ప్రాజెక్టులు కేసీఆర్ ఘనతే
ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలికి పడుతున్నారని జగదీశ్రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్పై దాడిచేసి తప్పించుకోవచ్చనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ ఇంకా బయటకే రాలేదని, అయినా ఏదేదో ఊహించుకొని వారు మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్లు తప్పు చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రంతో పదేండ్లు కొట్లాడి ప్రతి క్షణం ప్రాజెక్టులు మన చేతి నుంచి చేజారకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా హక్కులను వదులుకోబోమని ప్రాజెక్టులను రాష్ట్ర కంట్రోల్లో ఉంచిన ఘనత కేసీఆర్దేనని వివరించారు. ఇన్నాళ్లూ మన వాటాను వాడుకోగలిగామని, పదేండ్లలో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగుకు సరిపడా నీరందించడం వల్లే పుష్కలంగా పంటలతోపాటు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేసుకొని, తాగునీటికి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని వెల్లడిచారు.
ప్రభుత్వ తీరును ఎండగడతాం
కేంద్రం కేఆర్ఎంబీపై సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారని, ముఖ్యమంత్రి అధికారులతో ఎందుకు సమావేశం పెట్టలేదని, దానిపై నీటిపారుదలశాఖ మంత్రి ఎందుకు సమీక్ష చేయలేదని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. అధికారులే వెళ్లి ప్రాజెక్టులను అప్పచెప్పి రావాల్సి రావడానికి కారణం ఏమిటని నిలదీశారు. రేవంత్ ఎక్క డో ఇంకో ప్రయోజనం పొందడానికే రాష్ట్ర, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుతోపాటు అన్ని వేదికలపై ఎండగడతామని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడింది, హక్కులను కాపాడింది కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. రెండు జాతీయ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం వల్లే మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి మన జుట్టు కేంద్రం చేతికిచ్చారని ఆరోపించారు.
కృష్ణాజలాలపై కేంద్ర పెత్తనం తో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతు ల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం దోపిడీకి గురి కాబోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నా రు. పదేండ్లలో సా గు, తాగునీటితోపాటు విద్యుత్తు అందించామని చెప్పారు. వరుసగా సాగర్ ఎడమ కాల్వ కింద 18 పంటలకు నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ రెండో పంటకు కూడా నీరు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదని పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఎడమ కాల్వ రైతాంగం ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాధ్యత లేని కాంగ్రెస్ మంత్రులతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నాయకులు పాల్గొన్నారు.