MLA Jagadish Reddy | సూర్యాపేట : ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాల్గొని, కార్మికుల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని సీఎం అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ గురించి కామెంట్ చేసేటోళ్లకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక చెంపపెట్టు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నడు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు.. భయంతో అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారు. ఒక్క మంచిపని చేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారు. రేవంత్ వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారు. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్సే విలన్. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్. ఉద్యమ సమయంలో 359 మందికి కాల్చి చంపిన పాపం కాంగ్రెస్ పార్టీది కాదా..? కేసీఆర్ దీక్ష సమయంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా..? అందుకే ముమ్మాటికీ తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్సే అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలను ప్రజలంతా స్వాగతించిండ్రు. పదవి రాగానే సోనియాని బలి దేవతన్న మాటలు మరచిపోయావా? తెలంగాణలో పదవులను అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు. తెలంగాణ ద్రోహుల కొమ్ముకాసేటోళ్లకు మన అభివృద్ధి కూడా భ్రమే. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిది. పదేండ్లు మాదే అధికారమన్న వాళ్లకి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే భయమెందుకు. ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేని సీఎం రేవంత్. అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయలేకే విమర్శలు. కేసీఆర్ పై చిల్లర మాటలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టండి అని రేవంత్ రెడ్డికి జగదీశ్ రెడ్డి సూచించారు.