Jagadish Reddy | నల్లగొండ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సరికాదు. ఇది దారుణం అని మండిపడ్డారు. నల్లగొండలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా గెలవాలని అరాచకాలు సృష్టిస్తోంది కాంగ్రెస్ పార్టీ. గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు నడుం బిగించారు. ప్రశ్నించే వారిపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుంది అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు భారీగా పెరిగింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండొద్దు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మాదిరి పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.