Harish Rao | బీసీలు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మార్చి 1 నుంచి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం మిరిగోన్ పల్లి వీరయోధుడు పండుగ సాయన్న జన్మస్థలం నుంచి నిర్వహించతలపెట్టారు. ఈ బీసీ మహా పాదయాత్రకు హాజరుకావాలని కోరుతూ ఆలిండియా ఓబీసీ జేఏసీ బృందం మాజీ మంత్రి హరీశ్రావును శనివారం కలిసి ఆహ్వానించింది. ఈ సందర్భంగా జేఏసీ బృందంతో హరీశ్రావు మాట్లాడారు.
కులజనగణన, మహిళా బిల్లులో బీసీ కోటా, రిజర్వేషన్లపై 50శాతం వాటా ఎత్తివేతతో పాటు చట్టసభల్లో బీసీ వాటా కోసం ఆలిండియా ఓబీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని హరీశ్రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీసీ సబ్బండ కులాల పాత్ర కీలకమైందని, అదే స్పూర్తితో బీసీ వాటా సాధన ఉద్యమం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.