Harish Rao | హైదరాబాద్ : వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వక, సరిపడ కరెంట్ సరఫరా చేయక, ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మీడియాతో మాట్లాడారు.
నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలంలోని లక్ష్మీభాయి తండాకు తనతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లి రైతుల పరిస్థితి అడిగి తెలుసుకున్నాం. రైతుల ఆవేదన కన్నీళ్లు ప్రత్యక్షంగా చూశాం. సత్యమ్మ అనే రైతుల పొలంలోకి వెళ్లినప్పుడు నాలుగు బోర్లు వేస్తే చుక్క నీరు పడలేదు. క్రేన్లను కిరాయికి తీసుకొచ్చి బావుల్లో పూడిక తీస్తున్నాం. ఇప్పటి వరకు రూ. 4 లక్షల అప్పు అయిందని మా దృష్టికి తీసుకొచ్చారు. లక్ష్మీ అనే రైతు 6 బోర్లు, జంకు 9 బోర్లు, శివశంకర్ 6, విజయ 4 బోర్లు వేశామన్నారు. అయినా నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని ఆందోళన చెందారు. ఇంతా జరుగుతంటే, క్షేత్రస్థాయిలో వాతావరణం గంభీరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక గుంట కూడా ఎండలేదని రైతులు గుర్తు చేశారు. పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాల్లో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదన్నారు. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదని అర్థమవుతోంది. ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాలపై దృష్టి సారించారు. పదేండ్లలో ఎప్పుడు లేనంత ఆందోళనలో రైతులు ఉన్నారు. నీటి నిర్వహణ సరిగా లేక, నీళ్లు ఇవ్వడంలో విఫలం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుబంధు ఇవ్వలేదు. వచ్చిరాని కరెంట్తో మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో రైతుల మీద ఆర్థిక భారం పడుతోంది. మరో వైపు అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందింది అని హరీశ్రావు తెలిపారు.
ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులకు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లేందుకు టైం దొరకడం లేదు. రైతులకు భరోసా కల్పించడానికి వారికి టైం లేదు. కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టారు. 180 మంది రైతుల ఆత్మహత్య గురించి ఆలోచించడం లేదు. అధికారుల బృందాన్ని కూడా పంపించలేదు. పరిస్థితిని సమీక్షంలేదు. రైతులకు భరోసా కల్పించలేదు. కేసీఆర్ హయాంలో బోరు బండ్లు కనిపించలేదు. క్రేన్లు కనిపించలేదు. కానీ ఇవాళ బోర్ల పొక్కల్లోనే రైతుల చెమట చుక్కలు పోతున్నాయి. అప్పుల పాలై ఆందోళనకు గురవుతున్నారు అని హరీశ్రావు పేర్కొన్నారు.