Harish Rao | కొడంగల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు.
కొడంగల్లో ఏవన్న కష్టాలు ఉన్నాయని రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసిందని హరీశ్రావు తెలిపారు. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికి జర్నలిస్టులు పని చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా జర్నలిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిద్ర పోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి కూడా జర్నలిస్టులు పని చేస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పని చేసే జర్నలిస్టులకు కోస్గి, కొడంగల్లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇది దురదృస్టకరం, సిగ్గుచేటు అని హరీశ్రావు మండిపడ్డారు.