హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని, ఇంతవరకు ఒక్కరి రుణం కూడా మాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని వివరించారు. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో వందలాది రైతులకు బ్యాంకు నోటీసులొచ్చాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని, ఈ అనిశ్చిత పరిస్థితి గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్లకు మధ్య చిచ్చు పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని, రూ.రెండు లక్షల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ బ్యాంకర్లకు హామీపత్రం రాసివ్వాలని, పంటలకు రూ.500 బోనస్, ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.
(హరీశ్రావు రాసిన పూర్తి లేఖ ఎడిటోరియల్ పేజీలో..)