Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే అని గండ్ర వెంకటరమణారెడ్డి తేల్చి చెప్పారు. మోసం చేయటంలో బీజేపీని మించిన పార్టీ, మోదీని మించిన నాయకుడు మరొకరు లేరని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ఎల్పీలో గండ్రా వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాలు అంబరాన్ని అంటేలా సాగాయని, 21 రోజులపాటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. గురువారం భూపాలపల్లిలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయనని మోదీ చెప్పి బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయిందన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ దొంగనాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. మీడియాలో స్పేస్ కోసమే బండి సంజయ్ ఆరాట పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీలో తన అధ్యక్ష పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదు అయోమయస్థితిలో బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించే సీఎం కేసీఆర్పైనా, మంత్రి కేటీఆర్పైనా పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.