జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యతలను కేంద్ర జలవనరుల శాఖకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు(KRMB)కుఅప్పగించడంపై గద్వాల ఎమ్మెల్యే(Gadwala MLA) బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి( Bandla Krishna Mohan Reddy) తీవ్ర నిరసన తెలిపారు. శనివారం జూరాల ప్రాజెక్టు ( Jurala project) రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు, అనుచరులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గద్వాల నియోజకవర్గంలోని కృష్ణ నది పరివాహక ప్రాంతాల చెరువులు ఎండిపోవడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పాలమురుజిల్లాను ఎడారిగా మార్చబోతున్నాడని దుయ్యబట్టారు.
పాలమూరుకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీనిని అడ్డుకోకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లాల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.