BRS | ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు నిదర్శనం.. నారాయణపేట జిల్లా ఊట్కూరులో మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తకు అధికార పార్టీ సీఎంఆర్ఎఫ్ సాయం అందించడమే.
కొత్తపల్లికి చెందిన బీజేపీ కార్యకర్త ఎరుకలి నర్సింహులు భార్య కిష్టమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో ఆర్థిక సాయం కోసం స్థానిక బీజేపీ నాయకులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం రూ. 5 లక్షల ఎల్వోసీని స్థానిక బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్రాం, సీనియర్ నేత నర్సింహకు అందజేశారు. బీజేపీ కార్యకర్త భార్య వైద్యానికి ఎల్వోసి మంజూరు చేయించి, సహకరించిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.