హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం, ఊపు తీసుకొస్తున్నాయి. ఈ నెల 27న ప్రారంభమైన సమావేశాలు ప్రతి జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 19 నియోజకవర్గాల సమావేశాలు పూర్తి అయ్యాయి. ఈనెల 30న మహబూబ్నగర్, బెల్లంపల్లి, మేడ్చల్, 31న బాల్కొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యులను చేస్తున్నారు. అతిథులు మాట్లాడటమే కాకుండా కార్యకర్తలు, నాయకులతో మాట్లాడించి, వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. భవిష్యత్ లక్ష్యం, ప్రణాళికలను పార్టీ క్యాడర్కు వివరిస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నదని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందే వరకు విశ్రమించొద్దని నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రహస్య బంధాలను పార్టీ క్యాడర్కు వివరిస్తున్నారు.