హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని కాందార్-లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 5న నాందేడ్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తరువాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణ శరవేగంగా సాగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. ఈ పరిణామాల ప్రభావంతో మహారాష్ట్ర సర్కార్ రైతులకు పెట్టుబడి సహాయాన్ని ప్రకటించింది. అయినా సరే తమకు తెలంగాణ మాడల్ కావాలని మహారాష్ట్ర రైతాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈ నెల 26న కాందార్-లోహ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అదేరోజు వివిధ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిషన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, ప్రవీణ్, శివాన్, అంకిత్యాదవ్, గణేశ్, బాబూరావు కదం తదితరులు శుక్రవారం పరిశీలించారు. అనంతరం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. దేశానికి బీజేపీ శాపంలా మారిందని, బీఆర్ఎస్సే దేశానికి ఆశాదీపమని పేర్కొన్నారు. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా బీఆర్ఎస్ రూపుదిద్దుకున్నదని తెలిపారు. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలనే అకాంక్ష అన్ని రాష్ర్టాల్లో వ్యక్తమవుతున్నదని చెప్పారు.