నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 11: వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తుం టే, చంద్రబాబు మాదిరిగా కాంగ్రెస్ నేతలు దండుగ అంటున్నారని మండిపడ్డారు. కరీంనగర్ తెలంగాణచౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యం లో రేవంత్ దిష్టిబొమ్మకు ఉరివేశారు. హనుమకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో కాళోజీసెంటర్లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి నిరసనలో ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు. అందో ల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్..రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టి రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఉచిత కరెంట్ వద్దని నిస్సిగ్గు ప్రకటన చేసిన కాంగ్రెస్.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చి దొంగే దొంగ అని అరిచినట్టుగా ప్రవర్తిస్తున్నది. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. దీంతో కాంగ్రెస్పై రైతుల్లో తీవ్ర అగ్ర హం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తప్పుడు వ్యాఖ్యలను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
రేవంత్ చెంప చెళ్లుమనిపించాలి: మంత్రి వేముల ప్రశాంత్
నాడు వ్యవసాయం, రైతులపై అనుచిత వ్యాఖ్య లు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకీ పట్టనున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత చీకటి రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామంటున్న బీజేపీ, ఉచిత కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్తు వద్దంటున్న రేవంత్.. పింఛన్లు ఎలా పెంచుతారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల తీర్పుతో రేవంత్కు, కాంగ్రెస్కు చెంపచెళ్లుమనాలని సూచించారు.
రైతులను రేవంత్ అవమానించాడు: పువ్వాడ
రైతులకు 3 గంటల విద్యుత్తు చాలన్న అంశాన్ని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టి ఎన్నిలకు రావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి వ్యాఖ్య లు రైతులను అవమానించినట్టేనని అన్నారు. మంగళవారం మంత్రి ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. సీతక్కను సీఎం చేస్తామంటూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపుతున్నదని మండిపడ్డారు.
రైతులకు మేలు రేవంత్కు గిట్టదు: మంత్రి కొప్పుల
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలన్న వ్యాఖ్యలతో రైతులపై రేవంత్కి ఉన్న వ్యతిరేకత, అతని నిజస్వరూపం బయటపడిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకుపడ్డారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను అవమానించిన రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 3 గంట లు సరిపోతుందనటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రం బాగుపడటంరేవంత్కు ఇష్టంలేదు:మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణ బాగుపడటం రేవంత్రెడ్డికి ఇష్టం లేదని, అందుకే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రేవంత్కు రైతులంటే కుఏ మాత్రం ఇష్టం లేదని, ఇంకా చంద్రబాబు శిష్యరికంలోనే పనిచేస్తున్నాడని విమర్శించారు. గతంలో చంద్రబాబు రైతులకు వ్యవసాయం దండగ అన్నాడు.. అదే బాటలో రేవంత్ రైతులకు కరెంటు ఎందుకు అంటున్నాడని మండిపడ్డారు. రేవంత్ వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాబు శిష్యుడు ఇంకేం మాట్లాడుతడు: పల్లా
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని జూనియర్ చంద్రబాబు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబీమా, ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతల దుర్నీతిని రైతాంగం ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా వెళ్లి.. మన రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసిన రేవంత్ దిష్టిబొమ్మలను రైతులు దహనం చేయాలని కోరారు. చంద్రబాబు కూడా నాడు ఉచిత కరెంటు కోసం రైతులను పొట్టన పెట్టుకున్నాడని, ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి కూడా ఇప్పుడు అలాంటి కూతలే కూస్తున్నాడని ధ్వజమెత్తారు.
రేవంత్ది పైశాచిక ఆనందం;కాంగ్రెస్ తీరుపై మంత్రి హరీశ్ ధ్వజం
రేవంత్రెడ్డి తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మంగళవారం ట్వీ ట్ చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, ధరణి వద్దంటున్నదని, రైతుబంధు వద్దంటున్నదని, ఇప్పుడు ఉచిత కరెంటు కూడా వద్దంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ నాయకులు.. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎకుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న కాంగ్రెస్ నేతలకు ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి’ అని రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతులతో గోక్కున్నోడు బాగుపడలె: తలసాని
రైతులతో గోక్కున్నోడు బాగుపడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సాగుకు ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా? చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాం లో 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంటు ఉండేదని, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కోలుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయాలి : మంత్రి మల్లారెడ్డి
రైతు వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్న రేవంత్రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహస్తుందనడానికి రేవంత్ మాట లే నిదర్శనమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్ అని, అమెరికా వెళ్లి పార్టీ ఫండ్ పేరిట దోపిడీ చేస్తున్నాడని విరుచుకుపడ్డారు.
రైతులే గుణపాఠం చెప్తారు : మంత్రి ఎర్రబెల్లి
రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు తగిన గుణపాఠం చెప్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతు ఉన్నతికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు తదితర పథకాలు ప్రవేశపెడితే.. వడ్ల కొనుగోలులో రాజకీయం, వడ్లు తడిస్తే రాజకీయం, తడిసిన వడ్లు కొంటే రాజకీయం, కొన్న వడ్లకు పైసలు ఇచ్చే కాడ రాజకీయం చేసేది కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని ధ్వజమెత్తారు. అబ్ కీ బార్ కిసాన్ సరార్ అంటూ రైతుల తరుపున నినదిస్తున్న ఏకైక నేత కేసీఆర్ అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం చీకట్లోకి: ఇంద్రకరణ్రెడ్డి
పచ్చబడ్డ తెలంగాణను చూసి రేవంత్కి కండ్లు మండుతున్నాయ ని, అందుకే ఉచిత విద్యుత్తుపై పిచ్చివ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. నేడు కరెంటు, రేపు రైతుబంధు, రైతుబీమా వద్దంటారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తుంటే, కాంగ్రెస్ రైతుల పొట్టగొట్టేందుకు చూస్తున్నదన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకట్లోకి వెళ్లడం ఖాయం.
పచ్చదనం చూసి రేవంత్ కండ్లల్లో నిప్పులు: గంగుల
మోటర్లకు మీట ర్లు పెట్టాలని బీజే పీ, సాగుకు ఉచిత విద్యుత్తు వద్దని కాంగ్రెస్ రైతుల గొంతునొకే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కాంగ్రెస్కు రైతులంటే చిన్నచూపేనని.. మొన్న ధరణి, ఇప్పుడు ఉచిత విద్యుత్తు రద్దు చేస్తామంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పచ్చదనం చూసి రేవంత్ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.