హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ (BRS) కన్నెర్ర చేసింది. అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బస్సు డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెయ్యి మంది మోదీలు, రేవంత్లు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు రోడ్లపై బైఠాయించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిజామాబాద్ పట్టణంలో జడ్పీ చైర్మన్ విఠాల్ రావు ధర్నాలో పాల్గొన్నారు.
సిద్దిపేట పాత బస్టాంట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మోదీ కేడీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్లో వ్యాపార, వాణిస్య సముదాయాలు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నాయి.
ఇక కవిత అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీర్పేటలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బోరబండ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలతో హోరెత్తించారు. ఇల్లందు పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అశ్వారావుపేట రింగురోడ్డు సెంటర్లో పార్టీ నాయకులు ధర్నా చేశారు.