సాగు నీరు లేక పొట్టకొచ్చిన వరి పంట ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, చంద్రావతి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరుల బృందం ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్, నేలకొడపల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది.
అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎండాకాలంలో కూడా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకేవని అన్నారు. కానీ కేసీఆర్ పదేండ్ల పాలనకు భిన్నంగా రేవంత్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. గతేడాది ఇదే సమయంలో కళకళలాడుతూ కనిపించిన పాలేరు రిజర్వాయర్ ఈసారి డెడ్ స్టోరేజీ లెవల్కు పడిపోయిందని అన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ నింపి జిల్లా సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణ రివర్ బోర్డుకు అప్పగించడం వల్లనే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. ఏపీ 6 టీఎంసీల నీటిని తీసుకెళ్తే తెలంగాణ 1 టీఎంసీ నీటిని కూడా వినియోగించుకోలేక పోతున్నదని అన్ానరు. ముందస్తు ప్రణాళిక, ముందుచూపు లేకపోవడం వల్లనే ఖమ్మం జిల్లాలో కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ అండగా ఉంటారని.. వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని రైతులకు ధైర్యం చెప్పారు.