హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సోమవారం ఆయన స్పీకర్ ప్రసాద్కుమార్ను కలుసుకున్నారు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసినవారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ను కలిశామని, ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరామని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారం దానంపై అనర్హత వేటు పడటం ఖాయమని చెప్పారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లటం సమంజసం కాదని అన్నారు. రేవంత్రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టండి అని చెప్పాడని, ఇప్పుడు తాము ఆ మాట అనడంలేదని, ఆయనకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
ఇదే రేవంత్రెడ్డి.. దానం నాగేందర్ను పంజాగుట్ట బార్ దగ్గర బీడీలు అమ్ముకునే వాడని అన్నాడని, బీడీలు అమ్ముకునేటోన్ని ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. సింహం ఒక అడుగు వెనుకకు వేసింది అంటే.. నాలుగు అడుగులు ముందుకు వేయడానికేనని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ‘రేవంత్రెడ్డి.. దానంను చేర్చుకునే సమయంలో బాగా నవ్వుతున్నావు, నువు కొట్టావు.. మేము తీసుకున్నాం… మేము కొట్టినప్పుడు నువ్వు లేవలేవు’ అని కౌశిక్రెడ్డి హెచ్చరించారు. ‘మీరు గేట్లు తెరిచామని అంటున్నారు.. మేము గేట్లు తెరిచినప్పుడు మీరు భూస్థాపితం అవుతారు. గేట్లు తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, రేవంత్రెడ్డి ఐదేండ్లు సీఎంగా ఉండొచ్చని, కాంగ్రెస్లో జరిగే అంతర్గత కలహాలకు తాము భాద్యులం కాదని స్పష్టం చేశారు. ఖమ్మం, నల్లగొండ కాంగ్రెస్ బాంబులు ఎప్పుడైనా పేలొచ్చని కౌశిక్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.