BRS | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టనున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తిచేసింది.
స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పో లిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతి రోలర్, రోడ్రోలర్, సోప్డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీచేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టును గురువారం విచారణ చేపట్టనున్నది.