హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయటంపై తెలంగాణ భగ్గుమన్నది. మోదీ అనాలోచిత చర్యలు పరాకాష్ఠకు చేరాయని మంత్రులు, ఇతర నేతలు మండిపడ్డారు. మోదీ అప్రజాస్వామిక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాహుల్ ఉదంతాన్ని మంత్రులు, నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ గల పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మీద ఇలాంటి చర్య తీసుకోవడం బీజేపీ అసహనానికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంత్రులు కమలాకర్, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, దయకర్రావు, ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ సైతం కేంద్రం చర్యను ఖండించారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ట్రైకార్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ప్రధాని తీరుపై మండిపడ్డారు
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: కేటీఆర్
కాంగ్రెస్ నేత రాహల్ గాంధీపై వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వంపై వేటును మంత్రి ఖండించారు. రాజ్యాంగాన్ని ఘోరంగా వక్రీకరణకు గురిచేసిన ఇలాంటి ఉదంతం మరొకటి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే అత్యంత హేయమైన చర్యగా దీనిని అభివర్ణించారు. రాహుల్ ఉదంతం నేపథ్యంలో ఆయన శుక్రవారం ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ట్వీట్లో వాల్టేర్, మార్టీన్ నీమొల్లర్ సూక్తులను షేర్ చేశారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. పై కోర్టులో అప్పీల్కు వెళ్లే అవకాశం ఉన్నదని తెలిసీ వేటువేయడం సరికాదు. ప్రజల దృష్టి మరల్చే మోదీ మిషన్లో భాగంగానే రాహుల్పై అనర్హత వేటువేశారు. వైఫల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నిస్తున్నారు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అహంకారానికి నిదర్శనం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పార్లమెంట్లో అనర్హత వేటు వేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు, అహంకారానికి నిదర్శనం. నరేంద్ర మోదీ సర్కార్ తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో పడ్డాయి.
– ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు
లక్షద్వీప్ ఘటన మరిచారా?
లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే కేరళ హైకోర్టు స్టే విధించింది. మోదీజీ.. రాహుల్ విషయంలో ఎందుకు తొందర పడుతున్నారు?
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్