Vinod Kumar | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బొందపెడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమట్రెడ్డి మాట్లాడుతున్నారని.. వీరిద్దరి గురువులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డిలతోనే కాలేదని.. వీళ్లిద్దరితో ఏమవుతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం పదవులను తృణపాయంగా వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్దన్నారు. పార్లమెంట్లో ఇద్దరం ఎంపీలం ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇస్తామంటే నవ్వారని.. కృష్ణ, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పతయ్యేదని.. రాష్ట్రం వచ్చాక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణం చేసి పదేళ్లలో 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మాయ చేశారని పేర్కొన్నారు.
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు 50వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు చెప్పి ప్రజలను ఆగం చేసిందని, రైతు భరోసా రూ.15వేలు, సిలిండర్ రూ.500, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షతో పాటు తులం బంగారం, ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, క్వింటాల్కు రూ.500 బోనస్, తదితర హామీలు ఇచ్చిందన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన వాటిని అమలు చేయాలన్నారు.
ఐదేళ్ల కాలంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదు పైసలు తేలేదని, కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి ఇచ్చే నిధులను తానే తెచ్చానని బండి సంజయ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే బండి సంజయ్కి గ్రామాలు గుర్తొస్తున్నాయని, ఐదేళ్లుగా ఎంపీగా ఉండి ప్రజా సమస్యలను గాలికొదిలేశారన్నారు. ఎంపీగా ఉండి బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో ఒక్క నవోదయ పాఠశాల, త్రిబుల్ ఐటీ తేలేక పోయాడన్నారు. తాను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పట్టణానికి స్టార్ట్ సిటీ హోదా తెచ్చి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించి కరీంనగనగర్ను అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు.