Vinod Kumar | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఘాటుగా స్పందించారు. మోదీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. వరంగల్ బహిరంగ సభలో మోదీ రాష్ట్రంలో బీజేపీ ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి, హామీలు కురిపించే నరేంద్ర మోదీ వరంగల్ సభలో ఒక్క రూపాయి కూడా ప్రకటించ లేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు అని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోదీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారని కోపోద్రిక్తులయ్యారు.
మోదీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడతారని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు.. విభజన చట్టం, పార్లమెంట్ లో ఆమోదం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు ఇచ్చారన్నారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని నిప్పులు చెరిగారు. బీజేపీలోనే 200 మంది వరకు నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోదీకి లేదని తేల్చిచెప్పారు.
కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్కే పరిమితం అవుతాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సినిమాలుగా మాత్రం విడుదల కావు. బీజేపీ ట్రైలర్ కూడా అలాంటిదేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి… ఇప్పుడు తెలంగాణాలో అభివృద్ధి లేదనడం మోదీ ద్వంద వైఖరికి నిదర్శనం అని వినోద్ కుమార్ మండిపడ్డారు.