హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉకు పరిశ్రమపై కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి పరిశ్రమను కాపాడుకుందామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలకు, ఉక్కు పరిశ్రమ కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖ ఉకుకర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉకుపరిశ్రమని కాపాడుకోవటంపై భారత రాష్ట్ర సమితి మాత్రమే స్పష్టమైన విధానంతో ఉన్నదని, కేటీఆర్ ప్రకటన ఏపీ ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపిందని వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన వివిధ వర్గాల నేతలు, మేధావులు, విద్యావంతులతో చర్చలు జరిపామని, త్వరలో ఈ అంశంపై స్పష్టమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
విశాఖ ఉక్కుపై కేంద్రం కుట్ర
విశాఖ ఉకుకర్మాగారాన్ని కొన్ని శక్తులు కుట్రపూరితంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని, లక్షన్నర కోట్ల ఆస్తులు కలిగిన ఈ సంస్థకి పాతిక వేల కోట్లు మాత్రమే రుణాల మానిటైజేషన్కి అవకాశం కల్పించి, ప్రైవేటు సంస్థలకు మాత్రం రూ.70 వేల కోట్ల వరకు అవకాశం ఇవ్వటం దారుణమని తోట చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని, గత మూడు నెలల్లో గరిష్ఠంగా 7.8 శాతం నిరుద్యోగిత దేశంలో నమోదైనట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించిందన్నారు. 2022లో ఇది మరింత ఎకువగా నమోదైందని, కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితులకు కారణమని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక, ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలే ఎకువగా నష్టపోతున్నాయని, దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లాంటి సంస్థలను ఇప్పటికే కనుమరుగు చేశారని.. ఇప్పుడు విశాఖ ఉకుకి అదే గతి పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
త్వరలో కార్మిక సంఘాల నేతలతో భేటీ
విశాఖ ఉకుని కాపాడుకోవాల్సిన అంశంపై బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని తోట చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ ఉకు, ఎల్ఐసీ వంటి సంస్థల్ని ప్రైవేటీకరిస్తే మళ్లీ జాతీయీకరణ చేసే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ నిబద్ధతను ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. ముడిసరుకు, మూలధనం ఇవ్వకుండా విశాఖ ఉకు కర్మాగారానికి కృత్రిమ నష్టాలు సృష్టించి, ప్లాంటు మనుగడనే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేస్తున్నదని ఆరోపించారు. వీటిని ఆపేవరకు బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. అతి త్వరలోనే విశాఖ ఉకు కార్మికసంఘాల నేతలతో భేటీ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా విశాఖ ఉకు పరిరక్షణ ఉద్యమంలో తెలుగు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.