Srinivas Goud | హైదరాబాద్ : బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
దేశం మొత్తం ఓబీసీ వర్గాల వెనకబాటు తనంపై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుంది. చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయనే వాతావరణం ఏర్పడింది. చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగు ఇపుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావడం గగనమవుతోంది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్కు మోక్షం లభించలేదు. ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర బుక్ బిల్లులు ఏమయ్యాయో తెలియదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది ఏం తెలుస్తారు? బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలది వగల ప్రేమే అని తేలిపోయింది. బీసీ ఓట్ల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరుగవు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు లేరా ? రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేని అంశమనీ.. ఎవరైనా ఇక్కడ పెంచితే జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని తెలిసి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ను గవర్నర్ దగ్గరకు ఎందుకు పంపారు? బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రం దగ్గర రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. బీసీల మీద సీఎంది కపట ప్రేమ అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ బీసీ నాయకులు 42 శాతం రిజర్వేషన్ల పెంపు కోసం గట్టిగా కృషి చేయాలి. బీసీలకు ఏదీ చేయాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లులు ఆమోదించుకోవడానికి ఢిల్లీ వెళ్లి పాస్ అయ్యాకే హైదరాబాద్ తిరిగి రావాలి. కాంగ్రెస్, బీజేపీల చేతిలో మరోసారి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేర. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు పంపగానే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు .ఇపుడు ఏం సమాధానం చెబుతారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు ఆర్డినెన్స్ తేలేదు..? ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళితే మేము వస్తాం. ఆ పని చేయడం లేదు అని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.