Srinivas Goud | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే అని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ తిరస్కరించి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన జన్మదినం సందర్భంగా అయోధ్య వెళ్లి రాముడిని దర్శించుకుంటే బీజేపీలోకి వెళ్లినట్టేనా? అని ప్రశ్నించారు. దుష్ప్రచారం చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బహుజనుల పార్టీ కాబట్టే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పార్టీలో చేరారని తెలిపారు. ఆయనకు పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు. తమ పార్టీలో బహుజన నాయకత్వం బలంగా ఉన్నదని, అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. కొందరు బీఆర్ఎస్లో లాభం పొంది ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని, ఉద్యమంలో ద్రోహం చేసినవాళ్లే మళ్లీ ఇప్పుడు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను టార్గెట్ చేసేందుకే కవిత అరెస్టు జరిగిందని ఆరోపించారు. కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని, కచ్చితంగా మరోసారి పెద్ద పోరాటం మొదలవుతుందని వెల్లడించారు. తమది ఉద్యమ కుటుంబం అని, తనపై పదేండ్లుగా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నదని చెప్పారు. ‘అప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నాం.. ఇకముందూ కేసీఆర్ వెంటే ఉంటాం’ అని తేల్చిచెప్పారు. ప్రవీణ్కుమార్లా ఎంతోమంది మేధావులు బీఆర్ఎస్లో చేరబోతున్నారని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగుల పార్టీ అని, తెలంగాణ వచ్చాకే కేసీఆర్ నేతృత్వంలో తమలాంటి వాళ్లు పెద్దల సభకు వెళ్లే అవకాశం కలిగిందని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి అధికార దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని, ఈ ప్రభుత్వానికి సాగు నీరు కూడా ఇవ్వటం చేతకావటం లేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని, అక్కడి నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చి నాగార్జున సాగర్ కింద పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. రేవంత్లా నీచమైన భాష వాడుతున్న సీఎం దేశంలో మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేండ్ల తర్వాత వంద సీట్లతో ఏర్పడబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.
రేవంత్ ప్రభుత్వానికి విచారణలపై ఉన్న శ్రద్ధ పథకాల అమలులో లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గొప్ప పథకాలను పక్కనబెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి విర్రవీగే మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఆయన మాట్లాడుతున్న భాషకు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. రేవంత్కు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కన్నా మంచిపాలన చేసి చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. బీఆర్ఎస్లో నాయకులకు కొదవలేదని, ఎంత మంది వెళ్లినా నష్టం లేదని స్పష్టం చేశారు. ప్రవీణ్కుమార్ పార్టీలో చేరడం శుభ పరిమాణమని పేర్కొన్నారు.