Srinivas Goud | తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తన జన్మదినం సందర్భంగా అయోధ్య వెళ్లి రామున్ని దర్శించుకుంటే బీజేపీలో చేరినట్లేనా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి అనేక మందిని డబ్బులు, పదవులు, భయపెట్టి కాంగ్రెస్, బీజేపీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారడంపై కొందరు కోడి గుడ్డు మీద కొందరు ఈకలు పీకుతున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు జరిపామన్నారు.
బీఆర్ఎస్ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వాటన్నంటిని తిరస్కరించి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ బహుజనుల పార్టీ గనుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలో చేరారన్నారు. ప్రవీణ్ కుమార్కుపార్టీ లోకి స్వాగతం పలుకుతున్నామన్నారు. బీఆర్ఎస్లో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ బహుజన నాయకులను లోబరుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కుట్రలు ఒకొకటి బయటకు వస్తున్నాయన్నారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు.
కొందరు పార్టీ నుంచి లాభం పొంది ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ద్రోహం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని అన్నారు. కవిత అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని, కచ్చితంగా మరో సారి పెద్ద పోరాటం మొదలవుతుందని, పాలన పారదర్శకంగా ఉండాలని, అందరినీ కలుపుకొని పోవాలన్నారు. మరో పోరాటానికి పాలకులు ఆజ్యం పోయకూడదన్నారు. తమది ఉద్యమ కుటుంబం అని, తన పై పదేళ్లుగా దుష్ప్రచారం జరుగుతూనే ఉందన్నారు.