కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలవికానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసిందని.. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచిందని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రంది లేకుండా పంటలు పండించుకున్న రైతులను అరిగోస పెడుతున్నదని విమర్శించారు. రైతుబంధు కోసం కేసీఆర్ సర్కారు దాచిన రూ. 7500 కోట్లను గుత్తేదారులకిచ్చి.. రైతుల నోట్లో మట్టికొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ప్రారంభమైన 36 గంటల రైతు నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి, దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు నిరంజన్రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటును సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఖాళీ చేశారని మండిపడ్డారు. 80 పిల్లర్లు ఉన్న బరాజ్లో 3 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తూ కరువును తెచ్చారన్నారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు రూ. 80 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంలోని కాంగ్రెస్ కుటిలనీతి అర్థమవుతున్నదని అన్నారు. రేవంత్ సర్కారు రైతులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని, ఆదుకునే దాకా కాంగ్రెస్ సర్కార్ను నిద్రపోనివ్వం. మేమూ నిద్రపోమని తేలిచెప్పారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మీద పగ ఉంటే తీర్చుకో.. దేశానికి అన్నం పెట్టే రైతులు ఏం పాపం చేశారని నిలదీశారు. ఉన్న పంటలను కాపాడి ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.