ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు లీకులిచ్చి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. ఏ ఆధారాలు లేకుండానే ఈ విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.
ఫోన్ట్యాపింగ్ ఆరోపణలకు లీగల్ సెన్స్ లేదని నిరంజన్రెడ్డి మండిపడ్డారు. డైలీ సీరియల్లా లీకులిచ్చి ముద్దాయిల్ని చేయాలని చూస్తున్నారని అన్నారు. లీకులిచ్చి ఏదో సాధించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. నిందితుల నేరాంగీకార ప్రకటనలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. విచారణను ప్రభావితం చేసేలా లీకులు ఇవ్వడం కూడా నేరమే అని అన్నారు. ఇందులో కేసీఆర్ను బద్నాం చేయాలనే కుట్ర తప్ప మరేదీ లేదని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల ఫోన్లునే ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. తన ఫోన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చిరంజీవి అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ను తాము పట్టించుకోలేదని స్పష్టం చేశారు.