Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మోదీ ఈడీ.. ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్రాన అవినీతి జరిగినట్లేనా అంటూ నిలదీశారు. ఎవరైనా ఒక వ్యక్తి మోదీకి డబ్బులు ఇచ్చామంటే అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదే అని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో కేసీఆర్ను, ఢిల్లీలో కేజ్రీవాల్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందువరకు సాక్షిగా ఉన్న కవితను.. పార్లమెంటు ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని.. నిందితురాలు కాదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కవితను బీజేపీ అరెస్టు చేయించిందన్నారు. ఈ కేసులో అసలు కవిత దగ్గర ఏమైనా డబ్బు దొరికిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు పాలసీలు తీసుకురావడం, వాటిని మార్చడం సహజమేనని తెలిపారు. ప్రధాని మోదీ గతంలో పాలసీలు ఏవీ మార్చలేదా? అని ప్రశ్నించారు. మోదీ డబ్బులు తీసుకునే పాలసీలు మారుస్తున్నారా? అని నిలదీశారు. అనేక రాష్ట్రాలు మద్యం పాలసీలు మార్చినట్టే.. ఢిల్లీలో కూడా మార్చారని తెలిపారు. అప్రూవర్లుగా మారి ఏది చెప్పినా చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఎవరైనా మోదీకి డబ్బులు ఇచ్చామని చెబితే.. ఆయన్ను కూడా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.
కవిత విషయంలో ఈడీ అనేక తప్పులు చేసిందని.. రిమాండ్ చేయకుండానే కవితను కస్టడీకి ఇచ్చారని అన్నారు. మద్యం కేసులో బీజేపీ నేతలు ముందు స్పందిస్తే ఈడీ తర్వాత వచ్చిందని సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్టే ఈడీ వ్యవహరిస్తోందని తెలిపారు. కవిత అరెస్టు అవుతుందని బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుసని ఆమె సందేహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ పక్క దారి పట్టిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ బీఆర్ఎస్ మొదలు పెట్టినప్పటి నుంచి బీజేపీ ఆయనపై కక్ష కట్టి నైతికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కవిత పోరాట యోధురాలని, ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయట పడుతారని ధీమా వ్యక్తం చేశారు.