RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడటంతో తనను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారని నాగర్కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడొద్దని.. ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాలని మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు తనను కోరుతున్నారని చెప్పారు. కానీ తాను పార్టీ వీడనని స్పష్టం చేశారు.
తాను గతంలో చేసిన బీఎస్పీ-బీఆర్ఎస్ కూటమి ప్రయత్నం గానీ.. బీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది తన సొంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో.. అక్రమ ఆస్తుల సంపాదన కోసమో.. పోలీసు కేసులకు భయపడో.. హంగులు ఆర్భాటాలు ఉన్న జీవితం కోసమో కాదని తెలిపారు. తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనుకబడి ఉన్నదని.. వాళ్ల కోసం చట్టసభలో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను తన శక్తి మేరకు సమూలంగా మార్చాలనే ప్రజా జీవితంలోకి వచ్చానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నమ్మానని అన్నారు. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి ఫాసిస్టు శక్తుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత, రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న బలమైన బీఆర్ఎస్ పార్టీని వేదికగా ఎంచుకున్నానని వివరించారు. ఇందులో తనకు గానీ.. తనను నమ్ముకున్న వర్గాలకు గాని ఎలాంటి సంశయం లేదని తెలిపారు.
గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అని తెలిపారు. దీన్ని ధైర్యంగా సర్వశక్తులొడ్డి అధిగమించిన నాడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని పేర్కొన్నారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని.. ఆ విషయంలో పోలీసుల డ్యూటీని ఎవరూ కాదనరన్నారు. కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన థంబ్నెయిల్స్తో రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను మనం అందరం తిప్పికొట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.
ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తి మన ప్రస్తానాన్ని ఆపలేదని అన్నారు. అందుకే విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దామని పిలుపునిచ్చారు.