హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కార్పొరేట్-కాంగ్రెస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ బహుజనులకు కాంట్రాక్టులు నిలిపివేసి తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం నుంచి ఎస్సీలను వ్యాపారరంగంలోకి అడుగుపెట్టేలా చేసి, ఎవరి కాళ్ల మీద వాళ్లు ఆత్మగౌరవంతో నిలబడేలా చేసిందని గుర్తుచేశారు.
ఎస్సీలు పారిశ్రామిక రంగంలో రాణించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)లో 40% మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం తాజాగా పిలిచిన గురుకులాల టెండర్లలో కూడా ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంట్రాక్టర్లుగా పనికిరారని పరోక్షంగా చెప్తూ వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారని, దళితబంధు పథకం కింద ఎస్సీలకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఒకరికీ పథకం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టుల్లో 18% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, 18 నెలల కాలంలో ఒక కాంట్రాక్ట్ కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వలేదని విమర్శించారు. ‘అందుకే రేవంత్రెడ్డి సరార్, కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేకమైనవి. ఖర్గే మోసాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తరంట’ అంటూ ప్రవీణ్కుమార్ ఎక్స్ వేదికగా విమర్శించారు.