RS Praveen Kumar | హైదరాబాద్ : భువనగిరి గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి చిన్నలచ్చి ప్రశాంత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజా పాలనా..? లేదా ప్రజలపై ప్రతీకార పాలనా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను ఆర్ఎస్పీ సూటిగా ప్రశ్నించారు. డాక్టరో, ఇంజినీరో కావాలని చదువుకోవడానికి వచ్చిన ప్రశాంత్ ఫుడ్ పాయిజన్తో చనిపోవడం అత్యంత విషాదకరమని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఇదే భువనగిరిలో రెండు నెలల క్రితం ఇద్దరు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఉరేసుకుని చనిపోయారు. ఈ ఘటనలపై రేవంత్ రెడ్డి స్పందించలేదు. గుండె లేని వ్యక్తి, పట్టపగలే అబద్దాలు చెప్పే వ్యక్తి మనకు సీఎంగా ఉండాల్నా..? మన బిడ్డల ప్రాణాలు ఇతని చేతిలో పెడుదామా..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచించండి అని కోరారు.
ఏప్రిల్ 10వ తేదీన ప్రశాంత్ డయేరియాకు గురయ్యాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి చికిత్స అందించాడు. 12వ తేదీన అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా కూడా తరగతులకు హాజరయ్యాడు. భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ గత 6 రోజులుగా స్కూల్కు రావడం లేదు. అక్కడున్న ఆర్వో ప్లాంట్ కూడా పని చేయడం లేదు. ఇదీ తెలంగాణ గురుకులాల్లోని పరిస్థితి. తెలంగాణలోని సంక్షేమ పాఠశాలలకు బాధ్యులైన మంత్రి ఎవరో తెలుసా..? అది మరెవరో కాదు రేవంత్ రెడ్డి! ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పాఠశాలను సందర్శించలేదు..! గురుకులాల పనితీరును కూడా ఆయన సమీక్షించలేదు. ఇలాంటి నాయకులు అవసరమా? మన జీవితాలు ముఖ్యం కాదా? రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.