RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హత్యా రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజే జూపల్లి అనుచరులు, బీరం హర్షవర్ధన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. గంట్రావ్పల్లిలో బీఆర్ఎస్ నాయకుడు, ఆర్మీ జవాన్ మల్లేష్ యాదవ్ను కాంగ్రెస్ నేతలు హత్య చేశారు. పానగల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మీద డీజిల్ పోసి దాడి చేశారు. జొన్నలబొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ ఇంటిపై దాడి చేశారు. సాతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేశ్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. పరమేశ్ సోదరుడికి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం పోవాలని ఎఫ్ఐఆర్లో అతని పేరు నమోదు చేయించారు. చిన్న కార్పముల అనే గ్రామంలో దళిత యువకులపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేశారు. జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన భార్యతో పొలంలో ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు, జూపల్లి అనుచరులు దాడి చేశారని ఆర్ఎస్పీ గుర్తు చేశారు.
కుడికిళ్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మూర్తిని ఘోరంగా కొట్టారు.. దీని మీద ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు. కుడికిళ్ల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టి 15 రోజులు జైల్లో పెట్టారు. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నేత రామచంద్ర యాదవ్ పొలంలోకి కాంగ్రెస్ వాళ్లు వెళ్లి కొట్టి తిరిగి రామచంద్ర యాదవ్పైనే తప్పుడు కేసులు పెట్టారు. బుల్డోజర్ సంస్కృతి తెలంగాణకు తెచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు.. కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు ఓటు వేయలేదని ఒక పాస్టర్ ఇల్లును కూలగొట్టిన నీచమైన సంస్కృతి జూపల్లి కృష్ణారావుది. సింగోటంలో బీఆర్ఎస్ నేత భరత్ను ఎస్ఐ నాలుగు రోజులు జైల్లో పెట్టి ఘోరంగా కొట్టాడు. చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులపై 9 కేసులు పెట్టారు. పోలీసులు జూపల్లి చెప్పినట్టు వ్యవహరిస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.