హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. బీజేపీ, కాం గ్రెస్ రెండూ ఒక్కటేనని ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రొటెక్షన్ ఇస్తే.. బీజేపీకి రేవంత్రెడ్డి ఇస్తున్న ప్రొటెక్షన్ బట్టబయలైందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రె స్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని, బండి సంజయ్, రేవంత్రెడ్డి, ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ఫోర్స్లా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతూ, అరాచకాలకు పాల్పడుతున్నా, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర
ఆమనగల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు మాత్రమే వచ్చినా, ఆ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తున్నదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లిలో బీ ఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఆ ము న్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు మంత్రి వివేక్ కుట్ర చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని, మరోవైపు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. జనగామ మున్సిపాలిటీలో దళిత మహిళా స్వతంత్ర అభ్యర్థిపై, కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్రెడ్డి దాడి చేయడం హేయమని మండిపడ్డారు. ఈ దాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం దేనికి సంకేతమని ప్ర శ్నించారు.
ఎంపీ కడియం కావ్య రెండు చోట్ల ఓటు రిజిస్టర్ చేసుకొని తొర్రూరులో ఎక్స్అఫీషియో ఓటు ఎలా వేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ రెండుచోట్ల ఎక్స్అఫీషియో ఓటు రిజిస్టర్ చేసుకున్నారని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఓటు వేసేలా ప్లాన్ చేసుకున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోనూ ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయని చెప్పారు. రాజ్యాంగ్యాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. జనగామ కౌన్సిల్ ఆఫీస్లోకి పోలీసులు వెళ్లడం అక్రమమని పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ హల్లోకి పోలీసులు అలాగే వెళ్తారా? అని నిలదీశారు. పోలీసుల ద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణలో మరో ఉద్యమం రాబోతున్నదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.