సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. చెప్పడానికే నీతులు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారనీ.. కానీ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కాగానే నలుగురు సలహాదారులను నియమించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సలహాదారుల వ్యవస్థ ఉండదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర అవసరాల కోసం, పాలనలో పని తీరు మెరుగుపర్చుకోవడం కోసం రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా కేసీఆర్ నియమించుకున్నారని.. కానీ రేవంత్ రెడ్డి ఫక్తు రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని వివరించారు. ఓటుకు నోటు కేసులో సహకరించిన వారికి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చారని ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారు కాదు రేవంత్ రెడ్డి స్వంత సలహాదారు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియామకాలు.. వృథా నియామకాలు అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల సలహాదారుగా షబ్బీర్ ఆలీని నియమించారని.. మరి ఆ శాఖల మంత్రి ఏ బాధ్యతలు నిర్వహించాలని ప్రశ్నించారు. తమది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన 50 రోజుల్లో ఢిల్లీ, విదేశీ పర్యటనలకే సమయం వెచ్చించారని విమర్శించారు. రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులను నియమిస్తున్నారని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని వెయ్యి మీటర్ల లోతులో బొంద పెడతారని స్పష్టం చేశారు