తిరుమలాయపాలెం/ఖమ్మం, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మం డల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు బానోత్ రవి (ఆర్మీ రవి) సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. అంతకుముందు ఆయన మొబైల్లో వీ డియో రికార్డు చేసిన సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. ఆ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాల గురించి, ఎన్నికల సమయంలో పొంగులేటి ఇచ్చిన హామీలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నా యకులు నాపై కక్షగట్టారు. పోలీసుల సహకారంతో నన్ను చంపేందుకు ప్రయత్నించారు.
మంత్రి పొంగులేటి మేనల్లుడైన మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రామసహాయం నరేశ్రెడ్డి, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్ తదితరులు కలిసి నన్ను హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ఈ నెల 9న ఖమ్మం రాపర్తినగర్ ఏరియాలో కొందరు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో నాపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బనాయించారు. గతంలోనూ మరిపెడ బంగ్లా, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లలో నాపై తప్పుడు కేసులు పెట్టారు. అందుకే నేను ఆత్మహత్యకు సిద్ధపడ్డా. నేను చనిపోతే అధికార పార్టీ నేతలు, పోలీసులు బాధ్యులు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన రవిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న రవిని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, బానోతు చంద్రావతి తదితరులు పరామర్శించారు. రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చా రు. ఆయనకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాం గ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకూ అరాచకాలు, వేధింపులు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే విధానానికి వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్చేశారు.