RS Praveen Kumar | హైదరాబాద్ : కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మిపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీని కలిశారు. శ్రీధర్ రెడ్డి హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులైనా ఎవరినీ అరెస్టు చేయలేదు. మంత్రి జూపల్లి మీద ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. వారం రోజుల్లో న్యాయం జరగకపోతే ఆందోళనలు చేస్తాం అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎక్కడుంది న్యాయం అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి అనుచరులను కనీసం ప్రశ్నించలేదు. దోషులను జైల్లో పెట్టాలని శ్రీధర్ రెడ్డి తండ్రి కోరుతున్నారు. హత్య జరుగుతుందని చిన్నంబావి ఎస్ఐకి ముందే తెలుసు. అయినప్పటికీ ఎస్ఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నెత్తుటేర్లు పారిస్తున్నారు. ఇంత జరిగినా జూపల్లిపై చర్యలేవి..? అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నాడు. సామాన్యులకు రక్షణ కల్పించకపోతే హోం మంత్రి ఎందుకు..? చిన్నంబావి ఎస్ఐ, మంత్రి జూపల్లి చెప్పుచేతల్లో ఉన్నారు. జూపల్లితో కుమ్మక్కైన పోలీసులను డిస్మిస్ చేయాలి. శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. నిందితులు మీ ఇంట్లోనే ఉంటే ఇంక బాధిత కుటుంబానికి న్యాయం ఏం చేస్తావు. మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.