Ponnala Laxmaiah | హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డితో కలిసి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా? మంత్రుల మాటల్లో ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం మాత్రమే ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా? సీఎం బిజీగా ఉన్నట్లున్నారు, రాత్రి క్రికెట్ మ్యాచ్కు వెళ్లారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే… అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదు? సమాధానం చెప్పాలి. అన్నారం, సుందిళ్లలోని నాలుగు టీఎంసీలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు వదిలారు? తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.