హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది మూడో స్థానమేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో హోంవర్క్, టీం వర్క్ రెండూ లేవని, తాత్కాలిక ఉద్రేకాలు, రెచ్చగొట్టే ప్రసంగాలకు ఎప్పుడో కాలం చెల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వద్దని రేవంత్రెడ్డి తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే, కేసీఆర్ కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తిపై నోరు జారితే బాగుండదని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. రేవంత్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రజల మద్దతు కోల్పోయిన రేవంత్రెడ్డి తిట్లు, శాపనార్థాలు, దేవుళ్లపై ఒట్లు వేస్తూ మరోమారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 60 లక్షలకుపైగా సభ్యత్వం కలిగి అసెంబ్లీ ఎన్నికల్లో 1.85 శాతంతో ఓడిన బీఆర్ఎస్ చచ్చినపాము ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. బస్సుయాత్రతో కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి సీఎం తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ అనుభవం ముందు రేవంత్రెడ్డి అనుభవం ఎంత అని ప్రశ్నించిన పొన్నాల.. పార్లమెంట్, అసెంబ్లీకి ఎక్కువసార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్కు ఉందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా 9సార్లు, ఎంపీగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్కు దక్కిందని చెప్పారు. ఇప్పటి వరకు కేసీఆర్ 14సార్లు చట్టసభలకు ఎన్నికయ్యారని, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు కలిపి అత్యధికంగా గెలిచిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని గుర్తుచేశారు. రెండుసార్లు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్రమంత్రిగా, రెండుసార్లు సీఎంగా కేసీఆర్ పనిచేశారని, ఆయన ముందు రేవంత్ అనుభవం ఎంతని ప్రశ్నించారు. కేసీఆర్ను అనేముందు సిగ్గుండాలని, తలవంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని ముంచాలనుకుంటున్న వ్యక్తి సీఎంగా పనికిరాడని, అబద్ధాలకోరు రేవంత్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రేవంత్ గుట్టు బయటపడిందని, రైతుబంధు, రుణమాఫీ చేయలేని సీఎంగా ఆయన మిగిలిపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు. రైతుబంధు రాని 5 లక్షల మంది ఓటుతో దెబ్బకొడితే ఎక్కడ పడతాడో రేవంత్ ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ గొంతును బలంగా వినిపించేందుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని పేర్కొన్నారు. నేటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పంటనష్టాన్ని అంచనా వేయలేదని, కరువు పరిస్థితులపై అధ్యయనం చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై ఎవరు, ఎప్పుడు, ఎందుకు మాట్లాడుతున్నారో అన్నీ తమకు తెలుసని చెప్పారు. ఇకనైనా సంకుచిత రాజకీయాలు పక్కనపెట్టాలని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయాలంటే కేసీఆర్కు ఉన్నటువంటి దూరదృష్టి ఉండాలని, ఇప్పుడు అధికారంలో ఉన్న చిల్లరగాళ్లకు అలాంటి దూరదృష్టి లేదని పొన్నాల విమర్శించారు.