హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొస్తామని చెప్పిన మార్పు మసక బారుతున్నదని బీఆర్ఎస్ నేత పీ కార్తీక్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజం ఎవరినైనా తొందరగా నమ్ముతుందని, అదే సమయంలో తమని మోసం చేసిన వారిని గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ నాయకుడు దశరథ్తో కలిసి కార్తీక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని, ఏ ప్రభుత్వానికీ రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ సమయంలో వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గ్రహించారని, ఆరు గ్యారెంటీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగు, తాగునీరు, కరెంటు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని చెప్పారు. కేసీఆర్ పాలనకు, రేవంత్రెడ్డి పాలనకు తేడాను ప్రజలు గమనించారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం తలకెకిందా? అని ప్రముఖ జర్నలిస్ట్ బరాదత్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది తనను ఎలా నెట్టి వేసిందీ ఆమె చెప్పారని పేర్కొన్నారు. ఇంత తకువ వ్యవధిలోనే ఎంత మార్పు అని ఆమె ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల సెగ కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నదని, దానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అహంకారం తగ్గించేందుకు ఎన్నికల రూపంలో ప్రజలకు ఓ అవకాశం ఉన్నదని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ప్రజలను పట్టించుకోదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నట్టే కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరుగుతున్నదని తెలిపారు.