Kadiyam Srihari | కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ నుంచి గెలిపించుకుంటే.. ఆ పార్టీకే నమ్మక ద్రోహం చేసి పార్టీని వీడటమేంటని మండిపడ్డారు. నీకు దమ్ముంటే.. సిగ్గూశరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో గానీ, మాదిగ దండోరా ఉద్యమంలో గానీ లేకపోయినా సరే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీపరంగా అన్నివిధాలా మంచి అవకాశాలు కల్పించారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. అంతేకాకుండా కడియం శ్రీహరి కూతురు కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని.. ఎక్కడా ఆయనకు తక్కువ చేయలేదని పేర్కొన్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి, ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. నీతిమంతుడిని అని, ఎలాంటి పొరపాట్లు చేయనని, చేయలేదని పదే పదే చెప్పే నిన్ను ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఛీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు ఎన్టీఆర్కు, నేడు కేసీఆర్కు వెన్నుపోటు పొడిచావంటూ కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్లో ఉండి ఇందులో ఉన్న ఒక్కొక్కరిని కుట్రపూరితంగా బయటకు పంపి ఆవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలు తనకు రెండు కండ్లలాంటివని తెలిపారు. ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం నింపారు. మనం అందరం ఐక్యంగా ఉండాలని.. ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు ధీటుగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ఉందని పేర్కొన్నారు.