పాట్నీ-తూంకుంట మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా.. కేవలం ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారని విమర్శించారు. రక్షణ శాఖ భూములను సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమని అన్నారు. శ్రమ కేటీఆర్ది.. ప్రచారం ఏమో రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నుంచి శామీర్పేట వరకు, మేడ్చల్ హైవేలో స్కైవేలతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని మన్నె క్రిశాంక్ గుర్తు చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 48 ప్రాజెక్టులు టేకోవర్ చేస్తే.. అందులో కేసీఆర్ పదవీకాలం పూర్తయ్యేసరికి 36 ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్, కొత్తగూడ ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, ఆనంద్బాగ్ లేన్, నాగోలు ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, అండర్పాస్లు, మైండ్స్పేస్ జంక్షన్, బయో డైవర్సిటీ ఇలా దాదాపు 36 ప్రాజెక్టులను ఎస్ఆర్డీపీలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రక్షణ స్థలాలు ఉన్న కంటోన్మెంట్ ఏరియా చిక్కుముడిగా మిగిలిందన్నారు. కంటోన్మెంట్ భూముల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని పదే పదే రక్షణ శాఖ మంత్రులు, అధికారులను కలిసి.. వారి భూములను హెచ్ఎండీఏకు కేటాయించేలా కృషి చేశారని తెలిపారు. దీనికోసం సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ ఇలా ఎంతోమంది రక్షణ మంత్రులను కలిసి స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిన రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్ పాత్ర లేదని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రేవంత్ రెడ్డికే దీనిపై అవగాహన లేదని అన్నారు.
రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడంలో అసలు రేవంత్ రెడ్డి పాత్రే లేదని క్రిశాంక్ స్పష్టం చేశారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను చూపించారు. అందులో రక్షణ మంత్రిత్వ శాఖకు 750 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఇవ్వాలని.. అలాగే ఐడెంటిఫై చేసిన భూములకు సమానమైన ల్యాండ్స్ను రక్షణ శాఖకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో ఉందని పేర్కొన్నారు. దీని వెనుక చాలా ఎక్సర్సైజ్ ఉందని.. కేటీఆర్ నేతృత్వంలో మున్సిపల్ శాఖ అధికారులు ఈ అధ్యయనం చేసి కేంద్రానికి పంపించారని తెలిపారు. ఇందులో ఎన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు. అసలు ఏ ల్యాండ్ ఎక్కడ ఉంది? అందులో ఏది ఏ1 డిఫెన్స్ ల్యాండ్? ఏది బీ1 డిఫెన్స్ ల్యాండ్? ఏది బీ2 డిఫెన్స్ ల్యాండ్ అనే కనీస అవగాహన కూడా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలు ఎలా చేపట్టాలనే దానిపై కేసీఆర్ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలకు బృందాలను పంపించి అధ్యయం చేయించారని.. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు కూడా రూపొందించారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన నమూనాలో కేవలం స్కైవే మాత్రమే ఉందని.. మెట్రో ఫెసిలిటీ ఎక్కడా కనిపించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఓట్లు పడాలనే ఉద్దేశంతోనే హుటాహుటిన.. కనీస అవగాహన లేకుండా ఎలివేటెడ్ కారిడార్ కోసం శంకుస్థాపన చేశారని విమర్శించారు.
రక్షణ శాఖ భూముల అప్పగించాలని గతంతో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్ర రక్షణ శాఖ పుణె కంటోన్మెంట్ బోర్డుకు ఓ లేఖ పంపించిందని క్రిశాంక్ తెలిపారు. దానిపై స్పందించిన పుణె కంటోన్మెంట్ బోర్డు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పంపించి.. దానిపై తీర్మానం చేయాలని ప్రత్యేకంగా బోర్డు సమావేశం కూడా నిర్వహించదని అన్నారు. అయితే ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావాల్సిన రేవంత్ రెడ్డి హాజరు కాలేదని బయటపెట్టారు. ఆ సమావేశానికి సంబంధించి పుణె, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్లో మినట్స్ ఆఫ్ ది మీటింగ్స్ చూస్తే ఈ విషయం తెలుస్తుందని అన్నారు. కీలక సమావేశం జరిగినప్పుడు ఎందుకు హాజరు కాలేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు మీటింగ్ రాని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రక్షణ భూములను సాధించడంలో శ్రమ ఏమో కేటీఆర్ది.. ప్రచారం ఏమో రేవంత్ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. పదే పదే ఢిల్లీ వెళ్లి రక్షణ శాఖ మంత్రులను ప్రత్యేకంగా కలిసి కేటీఆర్ సాధించిన దాన్ని రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని క్రిశాంక్ విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కారణంగా రక్షణ శాఖ భూముల అప్పగింతలో జాప్యం జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా క్రిశాంక్ మండిపడ్డారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రచారం చేసి.. అమాయకపు తెలంగాణ ప్రజలను మోసం చేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే.. కేసీఆర్కు బీజేపీతో ఘర్షణలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రానికి ఏమీ రాలేదని అంటున్నారని విమర్శించారు. బీటీమ్ అని నువ్వే అంటావ్.. ఘర్షణలు ఉన్నాయని నువ్వే అంటావ్.. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి చెప్పు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి దీనిపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని పునరుద్ఘాటించారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్టుగా కేవలం ప్రచారం కోసమే హుటాహుటిన స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలను మోసం చేసేందుకు మాత్రమే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. మీరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా.. హైదరాబాద్ నగరానికి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో కేటీఆర్ పాత్రను చరిత్ర నుంచి తుడిచివేయలేరని స్పష్టం చేశారు.