హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల రాజకీయంతోనే ఎన్నికల కోడ్ రాకముందే పనులను ప్రారంభించారని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భూముల కోసం గతంలో మంత్రిగా కేటీఆర్ విశేషంగా కృషి చేశారని కానీ, నేడు వాటి పనులను హడావుడిగా ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ బీ టీంగా ఆరోపించారని, ఇప్పుడేమో కేంద్రంతో ఆ పార్టీ ఘర్షణ పూరిత వైఖరిని అవలంబించిందని అంటున్నారని, ఆ రెండిట్లో ఏది కరెక్టో రేవంత్రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కారిడార్ల వెంట మెట్రో వే నిర్మించకుంటే భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. రక్షణ శాఖకు భూము లు, ప్రత్యామ్నాయాలు చూపడానికి ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని గతంలో ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి ఆనాటి ఎంపీగా రేవంత్రెడ్డి హాజరుకానే లేదని తెలిపారు. మల్కాజ్గిరి, కంటోన్మెంట్ ప్రజలను మోసగించడానికే శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి చేపట్టారని విమర్శించారు. రక్షణ శాఖకు రూ.750 కోట్లు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ భూములను బదలాయించాలని రక్షణ శాఖ ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నదని, ఆయా విషయాలపై రేవంత్రెడ్డికి కనీస అవగాహన కూడా లేదని చెప్పారు.